భానోదయం: విందు భోజనాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు

28, ఫిబ్రవరి 2019, గురువారం

విందు భోజనాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు

       
       విందు భోజనాలతో పర్యావరణ కాలుష్యం ఎలా ఏర్పడుతుంది అనుకుంటున్నారా.!! విందులో వాడే పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులతో పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నారు.
 
     ఒకప్ఫుడు మోదుగ ఆకులతో తయారు చేసిన ఇస్తారాకులలో మరియు అరటి ఆకుల్లో వడ్డించేవారు. ఇవి కొన్ని రోజుల తర్వాత భూమిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. కాని ప్లాస్టిక్ పేపర్ భూమిలో కలిసిపోవడాని ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. వీటిని తగలబెడితే పొగవల్ల గాలి కలుషితం అవుతుంది. డ్రైనేజీల్లో పారేస్తుంటారు అలా వర్షాకాలం వచ్చేసరికి నీరు కలుషితం అవుతుంది. అన్ని రకాలుగా కలుషితమే.

          ఇప్పుడు ఏ ఫంక్షన్ లో చూసిన పేపర్ ప్లేట్లు దర్శనమిస్తాయి. పెళ్ళిళ్ళు మొదలు చిన్న చిన్న ఫంక్షన్ల వరకు అందరూ వీటినే వాడుతున్నారు. పేపర్ ప్లేట్లు పేపరే అయిన పైన ఒక పొర మాత్రం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. వేడి వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో తినవద్దని అందరికి తెలిసిన విషయమే అయిన సరే వాటినే ఉపయోగిస్తారు. వాటిని రిసైకిల్ పేపర్ తో తయారు చేస్తారు కాబట్టి దుర్వాసన కూడా వస్తుంటాయి కానీ వాటినే వాడుతుంటారు.వాటితో పాటు ప్లాస్టిక్ గ్లాసులను కూడా విచ్చలవిడిగా వాడుతుంటారు ఒకరు రెండు మూడు గ్లాసుల చొప్పున వృధా చేస్తుంటారు. తిన్న తర్వాత డ్రైనేజిల్లో వేస్తుంటారు. కొందరైతే కుప్పగా పోసి కాల్చేస్తుంటారు. అలా కాలుష్యాన్ని మరింత పెంచుతుంటారు. చదువుకోని వాళ్ళు తెలియక చేస్తుంటారు మరీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇలా చేస్తే పర్యావరణానికి హానికరం అని చెప్పరు. కొంచెం కూడా పర్యావరణ స్పృహ లేని చదువులెందుకు. పర్యావరణ పరిరక్షణ భాద్యత ఎవరికి లేదు.

   ..  పేపర్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లు లేదా పింగాణీ ప్లేట్లు వాడాలి. ఇప్పుడు చాలా కార్పోరేట్ కంపెనీలు తమ సంస్థల్లో స్టీల్ ప్లేట్లనే ఉపయోగిస్తున్నారు. వీటిని కడగడానికి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని కడిగేందుకు వేడి నీరు కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే ప్లాస్టిక్ గ్లాసులకి బదులు రాగి గ్లాసులు వాడండి పెళ్ళిలో రిచ్ గా ఉంటుంది. కుదరకపోతే టప్పర్ వేర్ ప్లాస్టిక్ గ్లాసులను వాడండి. వీటిని కూడా వేడి నీటితో శుభ్రపరుస్తారు కాబట్టి ఏ సమస్యలుండవు.

     ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు విందుభోజనం అంటే అందరూ నేలమీద కూర్చుని తృప్తిగా భోజనం చేసేవారు. వడ్డించేవారు అటు ఇటు తిరిగి వడ్డించేవారు. ఈ రోజుల్లో నిలబడి తినడం  ఫ్యాషనయిపోయింది. వడ్డించేవారు ఒకదగ్గర నిలబడి వడ్డిస్తున్నారు తినేవారు అటుఇటు తిరుగుతు తింటున్నారు. భోజనం చేసేటప్పుడు నిలబడి తినవచ్చా. పద్దతిగా కూర్చుని తినవచ్చుగా .? అంత ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేస్తారు భోజనానికి మాత్రం కూర్చుని తినే ఏర్పాటు చేయలేరా.?

   ఇప్పటికైనా ఆలోచించండి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను వాడడం మానేద్దాం. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం.

అలాగే విందుభోజనం కూడా కూర్చుని తిందాం.

 మార్పు అనేది మన నుండే ప్రారంబిద్దాం మనం చేసి చూపుదాం ఇతరులు కూడా మనను చూసి మారుతారు.

కామెంట్‌లు లేవు: