భానోదయం: మార్చి 2019

21, మార్చి 2019, గురువారం

శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వారి రథోత్సవం

       ప్రతి సంవత్సరం మా ఊరిలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. శివరాత్రి తర్వాత వచ్చె నవమి రోజు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల రథోత్సవం జరుగుతుంది.  ఈ బ్రహ్మోత్సవాలను జాతర అని పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
     


            కొండపైన ఉన్న ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు ఊరి మద్యలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి  ఆలయం వద్ద నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. రథోత్సవం రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకల్ల  స్వామి వార్ల రథాన్ని పూలతో అందంగా ముస్తాబు చేసి శ్రీ పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగిస్తారు. ఇక నాలుగు గంటల నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని భజనలు చేసుకుంటు రథాన్ని ఊరేగిస్తారు. ఉదయం నాలుగు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామ వారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు  శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల ఆలయం యొక్క కొండ దిగువకు  చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రథాన్ని లాగడానికి తాడు లాంటివి కట్టి లాగరు. కేవలం చెతులతో  నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. స్వామి వారి ఆశీస్సులతో ఇంత పెద్ధ రథాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయసనంగా ముందుకు తీసుకెళ్తున్నాం.




     ఒకప్పుడు జాతరకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చే వారు ఇప్పుడు మాత్రం జనాలు రావడం కొంచెం తగ్గిపోయింది.
        

13, మార్చి 2019, బుధవారం

ఎండాకాలంలో ఏ.సి, కూలర్ ఏది ఉత్తమం



              ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలి కోసం కూలరో, ఏ.సి నో వాడుతుంటారు. ఈ రెండింటిలలో ఏది ఉత్తమం.

ముందుగా కూలర్ గురించి చూద్దాం:

సామాన్యంగా కూలర్లను ఎండాకాలంలో మాత్రమే వాడుతుంటారు. మిగితా రోజులు పక్కన పెట్టేస్తుంటారు. ఏ.సీ లను గోడకు బిగిస్తాం కాబట్టీ ఎప్పుడైనాా వాడుకుంటాం. ఏ.సి లు, కూలర్ల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు కూడా ఉన్నాయి.
అవేంటో చూద్దాం

ప్లస్ పాయింట్లు:

➡️కూలర్ విషయానికి వస్తే దీని ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది.

➡️ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జరుపుకోవచ్చు.

➡️ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ.

➡️తక్కువ కరెంట్ బిల్ వస్తుంది

మైనస్ పాయింట్లు:

➡️కూలర్ నుండి శబ్ధం ఎక్కువగా వస్తుంది

➡️కూలర్ల వల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది

➡️నీరు అధికంగా అవసరం అవుతుంది.

➡️కూలర్ నీరు శుభ్రం చేయకపోవడం వలన శ్వాస సంబంద సమస్యలు వస్తాయి.

➡️గదిలో గాలిని కూలర్లు ఫిల్టర్ చేయలేవు కనుక కార్బన్ డై ఆక్సైడ్ గదిలో నే ఉండిపోతుంది.

➡️ కూలర్ లోపల  తేమ వలన ఇనుప పట్టీలు తుప్పు పడుతుంటాయి.

➡️కూలర్ ను తరుచుగా శుభ్రం చేస్తుండాలి లేదంటే దుర్వాసన వస్తుంది.

తప్పని పరిస్థితుల్లో కూలర్ వాడవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కూలర్ ని గదిలో కాకుండా గది బయట ఉంచితే బయట ఉన్నా మంచి గాలి కూలర్ ద్వారా గదిలోకి వస్తుంది.

రెండు మూడు రోజులకు ఒకసారి నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేస్తుండాలి.

శుభ్రం చేసేటప్పుడు కూలర్ కరెంట్ ప్లగ్ను సాకెట్ నుండి తీసివేసిన తర్వాతే శుభ్రం చేయాలి.

 కూలర్ ఫ్యాన్ ను బిగించే పట్టీలు తుప్పు పట్టకుండా పెయింట్ వేయాలి.

ఇలా చేయడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇప్పుడు ఏ.సి యొక్క సౌకర్యాలు, అసౌకర్యాల గురించి చూద్దాం.

ఏ.సి ని గదిలో గోడకు శాశ్వతంగా బిగిస్తాం కాబట్టి ఏ కాలంలో నైనా వాడుకుంటాం. దీని ఖరీదు ఎక్కువే అయిన ఆరోగ్యపరంగా కూలర్ కంటే బెటర్.

ఏ.సి యొక్క ప్లస్ పాయింట్లు:

➡️ఏ. సి వల్ల గదిలో మనకు కావలసినంత చల్లదనంగా ఉంచుకోవచ్చు.

➡️గోడకు పైన ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్ వంటి ప్రమాదాలు ఉండవు.

➡️గదిలోని కర్బెన్ డై ఆక్సెడ్ ను బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని గదిలోకి పంపుంతుంది.

➡️నీటి అవసరం ఉండదు


మైనస్ పాయింట్లు:

➡️ ఏ.సి ఖరీదు ఎక్కువ

➡️ఒక చోట నుండి వేరే చోటుకి జరపలేం

➡️కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది

 ధర పరంగా చూసుకుంటే కూలర్ బెటర్.
భద్రత, ఆరోగ్య పరంగా చూసుకుంటే ఏ.సీ బెటర్.


ఏ.సి ,కూలర్ల  కంటే ఇంటి ముందు కొన్ని  చెట్లు పెంచుకుంటే  ఉత్తమం.





















8, మార్చి 2019, శుక్రవారం

రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

           
         ఏదైనా జబ్బు చేస్తే జబ్బు తగ్గిపోతుందనే ధీమాతో డాక్టర్ వద్దకు వెళ్తాం. అనారోగ్యంగా వెళ్ళి ఆరోగ్యంగా ఇంటికి వస్తాం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డాక్టర్లంటేనే భయం వేస్తుంది. ఒక జబ్బు నయం అయ్యింది అనుకొని ఇంటికి వచ్చాక ఇంకో సమస్య మొదలవుతుంది.
ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తరచు నొప్పి వస్తుంటే మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే అప్పుడు వెలుగు చూస్తున్నాయి దారుణాలు. ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కత్తెర మర్చిపోవడం, దూది మర్చిపోవడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇవేవో చిన్న ఆసుపత్రిలో జరిగాయి అనుకుంటే పొరపాటే అవి చాలా పెద్ద ఆసుపత్రులే.
            ఒక మహిళకు   ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేసారు. ఇంటికి వెళ్ళిన మహిళ తరచూ కడుపులో నొప్పి వస్తుంటే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు పరీక్షలు జరిపి కడుపులో కత్తెర ఉన్నదని గుర్తించారు. అదికూడా రెండు మూడు నెలల తర్వాత గుర్తించారు. ఎంత దారుణం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా ఇంత నిర్లక్ష్యమా! మనిషి ప్రాణాలంటే అంత చులకన.
       అలాగే మెడిసిన్ ఇచ్చే క్రమంలో కూడా నిర్లక్షమే ఒకదానికి బదులు మరో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇద్దరు చిన్నారుల  ప్రాణాలు  పోయాయి. ఇంకా చాలా మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
   
   డాక్టర్లంటే దేవుళ్ళతో సమానం మీ మీద భరోసాతోనే జనాలు ఆసుపత్రులకు వస్తున్నారు. మీ నిర్లక్ష్య ధోరణితో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. డాక్టర్లంటేనే భయం కలిగించేలా ప్రవర్తించకండి. కొందరు చేసిన ఈ నిర్లక్ష్యం కారణంగా మొత్తం వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తుంది.
దయచేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి.


ఏదైనా జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరడం కంటే ముందు జాగ్రత్తగా సరైన ఆరోగ్య నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం..


7, మార్చి 2019, గురువారం

కల్తీలేని ఆహారపదార్థాలు

     

       మనం రోజు ఉపయోగించే నిత్యవసరాల పదార్థలలో కల్తీలేని ఆహారపదార్థం అంటూ ఏది లేదు. పాలు, పప్పు, ఉప్పు ,కారం,కూరగాయలు, పండ్లు ఇలా ఎలాంటి ఆహార పదార్థాలైనా అన్నీ కల్తీయె.
వీటిని తినడం వలన రోగాల పాలవడం గ్యారంటీ. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించి వాటిని వాడకపోవడం వంటివి చేస్తున్న అదంతా సమయం డబ్బు వృదా. అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలను తినడం ఉత్తమం.
          సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కడ దొరకవు దొరికిన చాలా తక్కువ కాబట్టి మనమే పండించుకోవాలి.
అదెలాగంటే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కిచెన్ గార్డెనింగ్ తో. మనకు కావలసిన కూరగాయలు పండ్లు మన ఇంటి పెరట్లో ఉన్న కాస్త స్థలంలో చక్కగా పండించుకోవచ్చు. వీటికి మనం రసాయనాలు వాడము  కేవలం పశువుల పేడ, వర్మీకంపోస్ట్  మాత్రమే వాడుతాం కాబట్టి సహజసిద్దంగా ఉంటాయి. పశువుల పేడ బయట ఎక్కడనుండైనా రైతుల వద్ద నుండి తెచ్చుకోవచ్చు.
వర్మీ కంపోస్ట్ కూడా మార్కెట్లో లభిస్తుంది. లేదా వీలుంటే వంటింటి వ్యర్ధాలతో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్ల రుచి చాలా బాగుంటుంది. రసాయనాలు వేసి పండించిన వాటికి అంతగా రుచి ఉండదు ఈ విషయం మీరు సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్లు తిన్నప్పుడు గమనిస్తారు. ఇంటి చుట్టు పక్కల మొక్కలు ఉండటం వలన స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది.
కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని రకాల ఔషదమొక్కలు పెంచుకుంటే మంచిది అందులో దోమలు రాకుండా చేసే మొక్కలను పెంచుకుంటే ఇంట్లోకి దోమలు దరిచేరవు.

          ఇక పాల విషయానికి వస్తే వీలుంటే ఒక ఆవును పెంచుకోవడం ఉత్తమం. దీనివలన మంచి పాలతో పాటు  పెరటి తోటకు సరిపోయే పేడ లభిస్తుంది.

     వంటనూనెల విషయానికి వస్తే నేరుగా రైతుల వద్ద నుండి వేరుశనగ, నల్లకుసుమలు, నువ్వులు వంటి వాటిని కొనుగోలు చేసి గానుగ పట్టించి వాడితే మంచిది. అలాగే పప్పులు వంటి వాటిని నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయాలి.
ఇలా సాద్యమైనంత వరకు కల్తీ లేకుండా ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

అనారోగ్యాల పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్తులు గుల్ల చేసుకోవడం కంటే ముందు జాగ్రత్తగా  కొద్దిగా కష్టపడి పైన చెప్పిన విధంగా సహజ ఆహారపదార్థాలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

               ఆరోగ్యమే మహాభాగ్యం