భానోదయం: జులై 2023

15, జులై 2023, శనివారం

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు



 

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు. వ్యాపారాలు పెద్ద వ్యాపారాల నుండి చిన్న వ్యాపారాల వరకు వారే చేస్తున్నారు. ఇక్కడ స్థానిక వ్యాపారులకు వ్యాపారం లేకుండా పోయింది. అలాగే నిర్మాణ రంగంలో పనులు కూడా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. ఇక్కడ కూలీలకు పనిలేకుండా పోయింది. మేస్త్రి పని, మార్బుల్,టైల్స్, ఫాల్ సీలింగ్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ ఇలా అన్ని పనులు వారే చేస్తున్నారు. స్థానిక ప్రజలకు పనిలేకుండా పోయింది. 


పరిశ్రమలలో కూడా వారే కార్మికులు. ఏ పని చూసినా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. వీరివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది. గ్రామాల్లో నిన్న, మొన్న వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా వారితోనే చేయిస్తున్నారు. 


వారు పని బాగా చేస్తారు, తక్కువ వేతనానికి పనిచేస్తారు, పని పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళరు అనే కారణంతో ఎక్కువగా వలస కూలీలతోనే పని చేయించుకుంటున్నారు ఇక్కడి కాంట్రాక్టులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు. ఇలాగే కొన్నేళ్లు గడిచాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉత్తర భారతీయులే పెత్తనం చెలాయిస్తారు. 


హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది వలస కూలీలు చాలా అవసరం కాని ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా వలస కూలీలే ఉన్నారు. చివరకు పోలాల్లో పనిచేయడానికి కూడా వారితోనే చేయించుకుంటున్నారు. 


ఇలా ప్రతీ పనికి వలస కూలీలతోనే ఎందుకు చేయించుకుంటున్నారు అంటే. వారు తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయడం, పని అయిపోయేంతవరకు ఎక్కడకు వెళ్ళరు అక్కడే ఉండి పని పూర్తిచేస్తారు. 


ఉదాహరణకు ఒక ఇల్లు కడితే తాపీ పనికోసం మేస్త్రిలు, కూలీలు ఆ ఇంటి పక్కనే చిన్న షెడ్ వేసుకుని ఇల్లు పూర్తిగా కట్టేంత వరకు అక్కడే ఉండి పనిచేస్తారు. పండుగలు, పెళ్ళిళ్ళు, దావత్ లు అని ఎక్కడికి వెళ్ళరు. అందుకే వారితోనే పనిచేయించుకుంటున్నారు.


మరి మన దగ్గర కూలీపని చేసేవారు లేరా అంటే ఉన్నారు. తక్కువ వేతనానికి మనవారు ఎక్కువ పనిచేయలేరు. మనవారికి పండుగలు, పెళ్ళిళ్ళు వంటివి వస్తే పనులకు వెళ్ళరు. ఇలాంటి కారణాలతో అన్ని పనులు వలస కూలీలతోనే చేయించుకుంటున్నారు.


తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలామంది రైతులు తమ భూములను అమ్మేసారు ఒకప్పుడు లక్షల  రూపాయల ధర ఉన్న ఎకరం భూమి కోటి రూపాయలు అనేసరికి చాలా మంది రైతులు భూములు అమ్ముకొని కొందరు మారుమూల ప్రాంతాల్లో భూములు కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఒకప్పుడు పెంకుటిల్లు లో నివసించే వారు ఇప్పుడు అన్ని హంగులతో నగరాల్లోని ఇండ్లలో ఉండే సౌకర్యాలు తమ ఇంట్లో ఉండేలా చూస్తున్నారు. పాత ఇంటిని తీసేసి కొత్త కాంక్రీటు ఇల్లు నిర్మించుకుంటున్నారు అందులో గ్రానైట్ ఫ్లోరింగ్, బాత్రూం,కిచెన్ లో టైల్స్, గోడలకు  లప్పం, ఆకర్షనీయమైన రంగులు, ఫాల్సీంలింగ్, లైటింగ్ ఇలా అన్ని హంగులతో ఇల్లు నిర్మించుకుంటున్నారు. 


తాతలు సంపాదించిన భూములు అమ్ముకొని కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇలా పక్కవాడు ఇల్లు కట్టుకుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి వాడికంటే గొప్పగా ఇల్లు కట్టాలని ఎకరం పొలం అయినా అమ్మేసి మరీ ఇల్లు కట్టుకుంటున్నారు. పొలం ఉన్నోడు పొలం అమ్మి ఇల్లు కట్టుకుంటే మరి పొలం లేనోడు ఏం చేస్తాడు చెప్పండి. కూలీ పనిచేసి ఇల్లు నిర్మించాలంటే అది జరగని పని రోజు కూలీ చేస్తే వచ్చే డబ్బులు తినడానికి,ఇంటి అవసరాలకే సరిపోతుంది. ఇక ఇల్లు ఎలా కట్టుకుంటాడు. అందుకే కూలీ పని చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించలేమని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారి కొందరు బాగానే సంపాదిస్తున్నారు. వారిని చూసి మరికొందరు ఇలా గ్రామాల్లో చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారిపోయారు. ఖరీదైన కార్లలో తిరగాలి, పెద్ద బంగళాల్లో ఉండాలి, రెస్టారెంట్లో తినాలి, బార్లలో తాగాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే ధోరణిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. ఇలాంటి ఆశలు నెరవేరాలంటే కూలీ పనిచేస్తే కుదరదు కాబట్టి తెలంగాణ లో చాలామంది   కూలీ పనులు చేయడంలేదు అందువల్ల వలస కూలీలతోనే చాలా పనులు చేయించుకుంటున్నారు. 


ఇది ఇలాగే కొనసాగితే మనవారు ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గల్ఫ్ దేశాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.


తర్వాత కొన్నాళ్లకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల వారు ఇతర దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. 


నేటి యువత కష్టపడకుండా డబ్బు సంపాదించే ఆలోచనల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నాళ్ళు నడుస్తుంది మహా అయితే మరో పదేళ్లు ఆ తర్వాత భూమి అమ్మడానికి ఎవ్వరూ ఉండరు. రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయ భూములు చాలావరకు వెంచర్లు, ఫ్లాట్లుగా మారాయి. వ్యవసాయ భూమి తగ్గిపోయింది. వ్యవసాయం చేసేవారు తగ్గిపోయారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంత ధరలు పెట్టి కొనాలంటే చాలా డబ్బు కావాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇల్లు, పిల్లల చదువులు కోసం చాలా డబ్బు కావాలి సామాన్య ప్రజలకు  అంత డబ్బు సంపాదించడం ఇక్కడ ఉండదు కాబట్టి ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది... 




14, జులై 2023, శుక్రవారం

కూరగాయలు, ఆకుకూరలు బయట కొనడం కంటే ఇంట్లోనే పెంచుకుంటేనే ఆరోగ్యం.

 



కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇలా అయితే ఎలా కొనేది అని భయపడుతుంటారు సామాన్యులు. ఇప్పుడు టమాటా ధర చూడండి కిలో 200 రూపాయలకు చేరింది. మార్కెట్లో ఏ కూరగాయలు అయినా కిలో 60 రూపాయలకు తక్కువ ధరలో లేవు. దీనికి కారణం ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణం అయితే మరో కారణం కూరగాయలు పండించే వారు తక్కువయ్యారు. అందువలన కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.


అంత ధర పెట్టి కొన్న కూడా అవి రసాయనాలు వేసి పండించిన కూరగాయలే. వాటిని తినడం మూలాన దీర్ఘకాలంలో రోగాలు రావడం ఖాయం. ఇక ఆకుకూరల విషయానికి వస్తే పురుగుమందులు కొట్టందే అవి పండవు అలాంటి ఆకుకూరలు మనం కొని తింటున్నాం. 

నేను ఒక ఊరిలో చూసాను ఒక ఆకుకూరలు పండించే వ్యక్తి ఆకుకూరలు కోసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఆ ఊరినుండి వచ్చే డ్రైనేజీ నీటిలో వాటిని ముంచి తీస్తున్నాడు. ఆ డ్రైనేజీలో కడిగిన ఆకుకూరలను అలాగే మార్కెట్లో అమ్ముతాడు. చూడండి ఎంత దారుణం ఇది. మనుషులు తినే ఆకుకూరలను ఇలా డ్రైనేజీ మురికి నీటిలో కడగడం చూస్తే చాలా అసహ్యం వేసింది. ఇలా నేను  చూసింది ఒక్కటే చూడనివి ఎన్నో ఉంటాయి. 


కాబట్టి డబ్బులిచ్చి కలుషితమైన కూరగాయలు, ఆకుకూరలు కొని అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు.



 కొంచెం కష్టపడతే మన కూరగాయలు, ఆకుకూరలను మనమే పండించుకుంటే అటు డబ్బు ఆదా అవుతుంది, ఇటు ఆరోగ్యంగా ఉంటాం.


మనం పండించిన కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా వాడుకుంటాం. 


రసాయనాలు వాడం కాబట్టి చాలా రుచిగా కూరలు ఉంటాయి.


ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఇంటిపెరట్లో కూరగాయలు పండిస్తే.


ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో కుండీలు పెట్టి కూరగాయలు పెంచండి.


వర్మీకంపోస్టు, కొబ్బరి పొడి, మట్టి మిశ్రమంతో కుండీలు నింపి కూరగాయలు పెంచాలి.


మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అందించాలి.


మన పెరటితోటలో పురుగుల బెడద ఉండదు కాబట్టి పురుగుమందుల అవసరం ఉండదు. 


మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టును కంపోస్టుగా మార్చి కూరగాయల మొక్కలకు అందించాలి. 


ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బయట కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు.


బయట కూరగాయలు, ఆకుకూరలు అధిక ధరలకు కొని అనారోగ్యం తెచ్చుకుని, హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బు,సమయం,ఆరోగ్యం పాడుచేసుకునే బదులు మన ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుని ఆరోగ్యంగా ఉందాం.




11, జులై 2023, మంగళవారం

ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని ఓ పాఠశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు హీమాన్షు దత్తత తీసుకుని కోటి రూపాయలు వెచ్చించి పాఠశాలో కొత్త బెంచీలు, మరుగుదొడ్లు, డైనింగ్ గది, ఆటస్థలం ఏర్పాటు చేసినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలియజేసారు. 


ఈ పాఠశాల మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విధ్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది.


 ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే కేవలం ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది. 


రాష్ట్రంలోని ప్రతి ఇంచు నాదే అని చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతీ మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలను అభివృద్ధి  పరచాలి.


ఏదో ఒక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరిస్తే అది ఎన్నికల ప్రచారం కోసమే చేసినట్లు అవుతుంది.