భానోదయం: తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు

15, జులై 2023, శనివారం

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు



 

తెలంగాణలో ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే దర్శనమిస్తున్నారు. వ్యాపారాలు పెద్ద వ్యాపారాల నుండి చిన్న వ్యాపారాల వరకు వారే చేస్తున్నారు. ఇక్కడ స్థానిక వ్యాపారులకు వ్యాపారం లేకుండా పోయింది. అలాగే నిర్మాణ రంగంలో పనులు కూడా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. ఇక్కడ కూలీలకు పనిలేకుండా పోయింది. మేస్త్రి పని, మార్బుల్,టైల్స్, ఫాల్ సీలింగ్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ ఇలా అన్ని పనులు వారే చేస్తున్నారు. స్థానిక ప్రజలకు పనిలేకుండా పోయింది. 


పరిశ్రమలలో కూడా వారే కార్మికులు. ఏ పని చూసినా ఉత్తర భారతీయులే చేస్తున్నారు. వీరివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది. గ్రామాల్లో నిన్న, మొన్న వేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా వారితోనే చేయిస్తున్నారు. 


వారు పని బాగా చేస్తారు, తక్కువ వేతనానికి పనిచేస్తారు, పని పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళరు అనే కారణంతో ఎక్కువగా వలస కూలీలతోనే పని చేయించుకుంటున్నారు ఇక్కడి కాంట్రాక్టులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు. ఇలాగే కొన్నేళ్లు గడిచాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఉత్తర భారతీయులే పెత్తనం చెలాయిస్తారు. 


హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది వలస కూలీలు చాలా అవసరం కాని ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా వలస కూలీలే ఉన్నారు. చివరకు పోలాల్లో పనిచేయడానికి కూడా వారితోనే చేయించుకుంటున్నారు. 


ఇలా ప్రతీ పనికి వలస కూలీలతోనే ఎందుకు చేయించుకుంటున్నారు అంటే. వారు తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయడం, పని అయిపోయేంతవరకు ఎక్కడకు వెళ్ళరు అక్కడే ఉండి పని పూర్తిచేస్తారు. 


ఉదాహరణకు ఒక ఇల్లు కడితే తాపీ పనికోసం మేస్త్రిలు, కూలీలు ఆ ఇంటి పక్కనే చిన్న షెడ్ వేసుకుని ఇల్లు పూర్తిగా కట్టేంత వరకు అక్కడే ఉండి పనిచేస్తారు. పండుగలు, పెళ్ళిళ్ళు, దావత్ లు అని ఎక్కడికి వెళ్ళరు. అందుకే వారితోనే పనిచేయించుకుంటున్నారు.


మరి మన దగ్గర కూలీపని చేసేవారు లేరా అంటే ఉన్నారు. తక్కువ వేతనానికి మనవారు ఎక్కువ పనిచేయలేరు. మనవారికి పండుగలు, పెళ్ళిళ్ళు వంటివి వస్తే పనులకు వెళ్ళరు. ఇలాంటి కారణాలతో అన్ని పనులు వలస కూలీలతోనే చేయించుకుంటున్నారు.


తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలామంది రైతులు తమ భూములను అమ్మేసారు ఒకప్పుడు లక్షల  రూపాయల ధర ఉన్న ఎకరం భూమి కోటి రూపాయలు అనేసరికి చాలా మంది రైతులు భూములు అమ్ముకొని కొందరు మారుమూల ప్రాంతాల్లో భూములు కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఒకప్పుడు పెంకుటిల్లు లో నివసించే వారు ఇప్పుడు అన్ని హంగులతో నగరాల్లోని ఇండ్లలో ఉండే సౌకర్యాలు తమ ఇంట్లో ఉండేలా చూస్తున్నారు. పాత ఇంటిని తీసేసి కొత్త కాంక్రీటు ఇల్లు నిర్మించుకుంటున్నారు అందులో గ్రానైట్ ఫ్లోరింగ్, బాత్రూం,కిచెన్ లో టైల్స్, గోడలకు  లప్పం, ఆకర్షనీయమైన రంగులు, ఫాల్సీంలింగ్, లైటింగ్ ఇలా అన్ని హంగులతో ఇల్లు నిర్మించుకుంటున్నారు. 


తాతలు సంపాదించిన భూములు అమ్ముకొని కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇలా పక్కవాడు ఇల్లు కట్టుకుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి వాడికంటే గొప్పగా ఇల్లు కట్టాలని ఎకరం పొలం అయినా అమ్మేసి మరీ ఇల్లు కట్టుకుంటున్నారు. పొలం ఉన్నోడు పొలం అమ్మి ఇల్లు కట్టుకుంటే మరి పొలం లేనోడు ఏం చేస్తాడు చెప్పండి. కూలీ పనిచేసి ఇల్లు నిర్మించాలంటే అది జరగని పని రోజు కూలీ చేస్తే వచ్చే డబ్బులు తినడానికి,ఇంటి అవసరాలకే సరిపోతుంది. ఇక ఇల్లు ఎలా కట్టుకుంటాడు. అందుకే కూలీ పని చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించలేమని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారి కొందరు బాగానే సంపాదిస్తున్నారు. వారిని చూసి మరికొందరు ఇలా గ్రామాల్లో చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా మారిపోయారు. ఖరీదైన కార్లలో తిరగాలి, పెద్ద బంగళాల్లో ఉండాలి, రెస్టారెంట్లో తినాలి, బార్లలో తాగాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే ధోరణిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. ఇలాంటి ఆశలు నెరవేరాలంటే కూలీ పనిచేస్తే కుదరదు కాబట్టి తెలంగాణ లో చాలామంది   కూలీ పనులు చేయడంలేదు అందువల్ల వలస కూలీలతోనే చాలా పనులు చేయించుకుంటున్నారు. 


ఇది ఇలాగే కొనసాగితే మనవారు ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గల్ఫ్ దేశాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.


తర్వాత కొన్నాళ్లకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల వారు ఇతర దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి వస్తుంది. 


నేటి యువత కష్టపడకుండా డబ్బు సంపాదించే ఆలోచనల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నాళ్ళు నడుస్తుంది మహా అయితే మరో పదేళ్లు ఆ తర్వాత భూమి అమ్మడానికి ఎవ్వరూ ఉండరు. రియల్ ఎస్టేట్ వల్ల వ్యవసాయ భూములు చాలావరకు వెంచర్లు, ఫ్లాట్లుగా మారాయి. వ్యవసాయ భూమి తగ్గిపోయింది. వ్యవసాయం చేసేవారు తగ్గిపోయారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంత ధరలు పెట్టి కొనాలంటే చాలా డబ్బు కావాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇల్లు, పిల్లల చదువులు కోసం చాలా డబ్బు కావాలి సామాన్య ప్రజలకు  అంత డబ్బు సంపాదించడం ఇక్కడ ఉండదు కాబట్టి ఇతర దేశాలకు వలస కూలీలుగా వెళ్ళాల్సి వస్తుంది... 




2 కామెంట్‌లు:

భానోదయం చెప్పారు...

వలస కార్మికులను వ్యతిరేకించడం లేదు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా పనిచేసి బతికొచ్చు.
మనవాళ్ళు అత్యాశకు పోయి పనులు చేయడం లేదు..

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసినది అక్షర సత్యం. అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములు ప్లాట్లుగా వెంచర్లుగా మారిపోయాయి. భవిష్యత్తు లో అన్నమో రామచంద్రా అనే పరిస్థితి వస్తుంది.
కష్టపడి పనిచేసే తత్త్వం తగ్గిపోయింది. తెలంగాణా తో పాటు అనేక రాష్ట్రాలలో ఇప్పుడు బీహార్, ఒరిస్సా , నేపాల్ కార్మికులు కనిపిస్తున్నారు.