భానోదయం

19, మే 2023, శుక్రవారం

ఏమి ఎండలు దేవుడా! దీనికి కారణం ఎవరు?

 ఎండలు మండిపోతున్నాయి ఏం ఎండలు దేవుడా ఇవి అని అంటున్నారు. బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. మా గ్రామంలోనే 38 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక నగరాల్లో అయితే 45 నుండి డీగ్రీలు ఉంటుంది.

 మరో పది ఏళ్ళలో 50 నుండి 55డిగ్రీలు దాటిపోతుంది. ఇందుకు కారణం ఎవరో కాదు అందరు కారణమే.  చెట్లు, అడవులను నరికేస్తున్నారు. కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరు కొండలు, గుట్టలు తవ్వేయ్యరు కదా అనొచ్చు.

 

 కొండలను తవ్వేది ఇప్పుడు సామాన్యుల కోసమే. ఇంటి నిర్మాణంలో ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు ఇంటి ఫ్లోరింగ్ కి గ్రానైట్ వాడాల్సిందే. డబ్బు ఎంతైనా పర్వాలేదు. అప్పు చేసైనా గ్రానైట్ వాడాల్సిందే. మరి ఆ గ్రానైట్ కావాలంటే కొండలను కోయాల్సిందే. కంకర, డస్ట్ ఇలా అన్ని ఈ కొండలనుండే తయారు అవుతాయి కదా. ఒకప్పుడు ఈ కొండలు పచ్చని చెట్లతో అంత్తెత్తునా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ ప్రాంతంలో ఎంత ఎండాకాలంలో అయినా చల్లగా ఉండేది. మరి ఇప్పుడో ఆ ప్రాంతంలో క్రషర్లతో కొండలను పిండి చేస్తున్నారు. పచ్చని ప్రాంతం అంతా వెలవెలబోతోంది దుమ్ము ధూళితో విపరీతమైన వేడితో అక్కడ చుట్టు పక్కల నిలవలేని పరిస్థితి.


ఇళ్ళు కట్టుకోవాలంటే కొండలను తవ్వాల్సిందే వేరే దారి లేదంటే అక్కడ జరుగుతున్న విద్వంసానికి మరోచోట చేట్లను పెంచితే కొంతవరకైనా పర్యావరణం కాపాడవచ్చు. 


ఎక్కడ చూసినా కాంక్రీటు మయం అయిపోయింది ఎండాకాలం వచ్చిందంటే కాంక్రీటు వలన  వేడి ఇంకా పెరిగిపోతుంది. వానాకాలం నీరు భూమిలోకి ఇంకిపోక వరదలు వస్తున్నాయి అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి కరువు ఏర్పడుతుంది.



మనకు ఎవరికి ఇవి  పట్టవు మనకు కావలసింది అభివృద్ధి మాత్రమే. ప్రకృతి ఏమైతే మాకేంటి. ఎండలు మండిపోయి, త్రాగడానికి నీరులేని దుస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది పర్యావరణం విలువ.


ఇలా పచ్చని ప్రకృతి అందాలు ద్వంసం అవడానికి కారణం ఏ ఒక్కరో కాదు అందరు కారణమే. మనం వాడుతున్నాం కాబట్టి వాడు కొండలు తవ్వేస్తున్నాడు. మరీ ఇప్పుడు ఇళ్ళు కాంక్రీటుతో కట్టకుండా ఎలా కడతాం అనుకోవచ్చు. ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి కాంక్రీటు తప్ప వేరే దారిలేదు కాబట్టి అలా కొండలను తవ్వుతూ వెళ్ళాల్సిందే చివరకు ఎప్పుడో అప్పుడు ప్రకృతే సమతుల్యం చేస్తుంది. 

17, మే 2023, బుధవారం

రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...

  టెక్నాలజీ మారుతున్న కొద్ది కొన్ని రంగాలు కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. దాదాపుగా దాశాబ్ధం క్రితం నుండే చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్లను తీసేసి వాటినే ఫంక్షన్ హాల్స్ గా మార్చేసారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ థియేటర్లను మూసేస్తున్నాయి. కారణం టెక్నాలజీ లో వచ్చిన మార్పు.
   ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లలో సినిమా చూడటమే ఒక సినిమా ను నాలుగైదు సార్లు చూసేవారు అప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉండేవి. మరి ఇప్పుడు ఒక సినిమాని చూడాలంటే పదిసార్లు ఆలోచిస్తూ ఉన్నారు జనం. రెండున్నర గంటలు సినిమా చూసే ఓపిక ఇప్పుడు ఎవరికిలేదు, ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సినిమా అయినా చూసే వీలుంది. అదికూడా నచ్చిన సన్నివేశాలు చూస్తూ నచ్చని సన్నివేశాలు దాటవేస్తూ చూసే అవకాశం ఉంది. ఇంత సౌలభ్యం ఉండగా సినిమా థియేటర్లలో ఎవరు సినిమా ఎవరు చూస్తారు. రెండున్నర గంటలు సమయం, డబ్బు వృథా అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి కొత్త కొత్త సినిమాలు చూడడానికి ఓటిటి యాప్స్ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉండగా ఇంకా థియేటర్లో సినిమాలు ఎందుకు చూస్తారు. 

 ఒకప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చూడాలంటే థియేటర్ వరకు వెళ్లి పెద్ద పెద్ద లైన్లో నిల్చుని టికెట్ల కోసం తొక్కిసలాటలో యుద్ధం చేసి టికెట్లు సంపాదించి, అక్కడ దొరకకుంటే బ్లాక్ లో ఎంత ధర అయినా కొని థియేటర్ లోపలికి వెలితే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ డబుల్ రేట్లకు కొని జెబుకు చిల్లు పెట్టుకోవాలి. ఇంత చేసినా థియేటర్ లోపల పోకిరీల హంగామా మరో తలనొప్పి. ఫ్యామిలీ తో వెళ్తే అంతే చుక్కలు కనిపిస్తాయి. 

 ఇన్ని ఇబ్బందులు పడి ఈ రోజుల్లో సినిమాలు ఎవరు చూస్తారు. ఎంచక్కా ఇంట్లోనే చిన్న థీయేటర్ లాంటి టీవీలు, సౌండ్ సిస్టం ఉన్నాయి. ఏ ఇబ్బందీ లేకుండా ఇంట్లోనే సినిమాలు చూసేయోచ్చు మీ వీలున్నప్పుడు.

ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్కు వెళ్ళేవారు. ఇప్పుడు సినిమాలే ఇంటికి వస్తున్నాయి. అంతా టెక్నాలజీ వల్లే. 

ఇప్పుడు జనాలు సినిమాలు చూడటం తగ్గించేసారు. షార్ట్ ఫిలిమ్స్, వ్లాగులు ఇవ్వే ఎక్కువగా చూస్తున్నారు. అరచేతిలో ఎంటర్టైన్మెంట్ ఉండగా సినిమా థియేటర్లు ఎందుకు దండగా అన్నట్టు ఉంది. ఆ విడియోలు కూడా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం వీడియో చూడడం గొప్ప కేవలం 15 సెకండ్ల వీడియోలు చూస్తారు అంతే. 15 క్షణాలు ఎక్కడ, మూడు గంటలు ఎక్కడ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో థియేటర్ లో మూడు గంటలు సినిమాలు చూసే ఓపిక ఎవరికి లేదు.  కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా థియేటర్లు పూర్తిగా కనుమరుగై పోతాయి...